బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా బాబాసాహెబ్‌ను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పిస్తూ.. అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. "ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తోందంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగమే. అంబేడ్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి" అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. "పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది" అని అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
 

BR Ambedkar
Chandrababu Naidu
Nara Lokesh
Ambedkar Jayanti
Indian Constitution
Andhra Pradesh
Dalit Rights
Social Justice
Political News
AP Politics

More Telugu News